కోదాడ: తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న కోదాడలో రూ.16.92 కోట్లతో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. శనివారం కోదాడ బస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణానికి వారు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం ద్వారా వారికి 11,400 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగేలా చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 600 బస్సులను అందించి వారిని కోటీశ్వరులుగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, మార్కెట్ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ, నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వేనేపల్లి చందర్రావు, షేక్ బషీర్, ఎండీ మహబూబ్జానీ, మున్సిపల్ వైస్చైర్పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి


