ఫ వాలీబాల్ క్రీడలో
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మిర్యాలగూడ యువకుడు
ఫ ఆర్థిక ఇబ్బందులను
అధిగమించి పేరు ప్రఖ్యాతలు
నిరుపేద కుటుంబంలో పుట్టినా.. ఆర్థిక
ఇబ్బందులు ఎదురైనా ఇవేవీ అతడి కలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. చిన్ననాటి నుంచి వాలీబాల్పై ఉన్న మక్కువతో
అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడకు చెందిన అమరవాది భాగ్యరాజ్. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్నగర్కు చెందిన అమరవాది పార్థసారధి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. భాగ్యరాజ్ తండ్రి ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తుండగా, తల్లి గృహిణి. ఎన్నో కష్టాలకోర్చి భాగ్యరాజ్ తండ్రి తన పిల్లలను చదివించాడు. పెద్దవాడైన భాగ్యరాజ్ పదో తరగతి వరకు స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని బకల్వాడీ పాఠశాలలో చదువుకున్నాడు. మహబూబ్నగర్లో ఇంటర్మీడియట్, చైన్నెలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. భాగ్యరాజ్కు చిన్నప్పటి నుంచి వాలీబాల్పై ఉన్న ఇష్టంతో యూనివర్సిటీ స్థాయి నుంచే అద్భుత ప్రతిభ కనబర్చి తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు.
సత్తా చాటి..
ఉద్యోగం సాధించి..
వాలీబాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భాగ్యరాజ్కు 2022లో స్పోర్ట్స్ కోటా కింద చైన్నెలోని సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉద్యోగం లభించింది. దీంతో అతడు తమిళనాడు రాష్ట్రం, జీఎస్టీ శాఖ తరఫున వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–23 బ్రిక్స్ గేమ్స్లో ఇండియా తరఫున వాలీబాల్ ఆడి కాంస్య పతకం సాధించాడు. 2020–21లో ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఆలిండియా ఇంటర్–యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని రజత పతకం, 2021–22లో కాంస్య పతకం గెలుపొందాడు. 2025లో రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన సీనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రస్తుతం తెలంగాణ వాలీబాల్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. జీఎస్టీ సెంట్రల్ టీమ్ తరఫున చైన్నె ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జీఎస్టీ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ చేతుల మీదుగా ‘బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్’ అవార్డు అందుకున్నాడు.
క్రీడలకు సరైన ప్రోత్సాహం కరువవ్వడంతో ఎంతోమంది ప్రతిభావంతులు పల్లెలకే పరిమితమవుతున్నారు. నేను ఎలాంటి ప్రోత్సాహం లేకుండానే సొంత కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాను. ప్రభుత్వాలు మాలాంటి క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకుంటే భవిష్యత్తులో
దేశానికి మరింత పేరు తీసుకొస్తాం. – ఎ. భాగ్యరాజ్


