యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. చైర్మన్తో పాటు పాలకమండలి సభ్యులకు చెందిన అభిమానులు, కుటుంబ సభ్యులు, నాయకులు తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆలయ మెయిన్ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో నాయకులు, అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చైర్మన్ సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పశ్చిమ ద్వారం ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియాతో మాట్లాడకుండా పలువురు ఆయనని బ్యాటరీ వాహనం వైపు తీసుకెళ్లెందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు, పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగింది. అదేవిధంగా వీఐపీలు వచ్చే సమయంలో కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఉండటంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచే కొండపైకి భక్తుల వాహనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో కొండ పైకి వచ్చేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనం కోసం సుమారు 4గంటల పాటు భక్తులు కొండ కింద వేచి ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు.


