మోతె: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బుడ్డిపుడి రాములు – రాణి దంపతుల కుమారుడు బుడ్డిపుడి వెంకటేష్ (26) మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలోని తన అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ఓ పిల్లవాడు కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి సమాచారం అందించాడు. బంధువులు చెరువు వద్దకు చేరుకుని వెంకటేశ్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నిడమనూరు: సాగర్ ఎడమకాల్వలో గల్లంతైన మేకల కాపరి గంధం ఎల్లయ్య(54) మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. నిడమనూరు శివారులో బుధవారం సాగర్ ఎడమకాల్వలో మేకల కాపరి గంధం ఎల్లయ్య ప్రమాదవశాత్తు పడి గల్లంతు కాగా అతడి మృతదేహం శుక్రవారం ముకుందాపురం వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు నిడమనూరు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పొలానికి వెళ్లిన వ్యక్తి వాగులో పడి మృతి
మిర్యాలగూడ అర్బన్: పాలేరు వాగులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య(55) పాలేరు వాగు అవతల ఉన్న తన పొలానికి ప్రతి రోజు పాలేరువాగు దాటి వెళ్తుంటాడు. రోజుమాదిరిగా ఈ నెల 12న మధ్యాహ్నం 12గంటల సమయంలో పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పాలేరు వాగు వెంట వెతకగా శుక్రవారం తెల్లవారుజామున అతడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై మృతుడి కుమారుడు అనంతుల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.


