భువనగిరిటౌన్ : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను త్వరగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో చేపట్టిన ఇందిర మహిళా శక్తి భవనం, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంలో సెర్ప్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యాప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలు
మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నోడల్ బృందం సభ్యులు వనం వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, పద్మశాలీ కాలనీ, కాశవారిగూడెం, ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసింది. పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీలు, లెస్సన్ ప్లాన్స్, స్టాక్ రిజిష్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించింది. కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్లు పుష్పలత, పరమేశ్వరి, నర్సయ్య, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు, రేపు సీపీఎం సమావేశాలు
భువనగిరిటౌన్ : సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశాలు చౌటుప్పల్, భువనగిరి కేంద్రాలుగా శుక్ర, శనివారం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు అదనంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ధర్మారెడ్డి కాల్వ పనులు పూర్తి చేయాలని, బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలకు మరమ్మత్తులు చేయాలని, బీబీనగర్ ఎయిమ్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.


