భూదాన్పోచంపల్లి: మహిళా చేనేత కార్మికులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలని యునైటెడ్ నేషన్–ఉమెన్ సంస్థ (ఢిల్లీ) ప్రతినిధి షిరిన్ అన్నారు. భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో నాలుగు రోజులుగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ సహకారంతో మహిళా చేనేత కార్మికులకు శ్రీజన్ పేరిట నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరున్నా, ఆ బ్రాండ్ ఇమేజ్ను వినియోగించుకొని సరైన మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు మార్కెటింగ్ రంగంలో రాణించాలంటే వారికి శిక్షణ ఎంతో అవసరం అని అన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు సొంతంగా వెబ్సైట్ రూపొందించుకొని నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. తమ ఉత్పత్తులను ఏ విధంగా ప్రమోట్ చేయాలి, కొత్త డిజైన్ల రూపకల్పన, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే ఎంపిక చేసిన ఐదుగురు మహిళా చేనేత కార్మికులకు ఢిల్లీలో జాతీయస్థాయిలో మరింత శిక్షణ ఇచ్చి వ్యాపారవేత్తలుగా రాణించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జార్ఖండ్, వారణాసి, ఓడిశా, అహ్మదాబాద్లో మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు. త్వరలో పోచంపల్లి కేంద్రంగా చేనేత కార్మిక మహిళలకు ప్రత్యేకంగా చేనేత డిజైన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డు గ్రహీతలు భోగ సరస్వతీబాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, మహిళా చేనేత కార్మికులు పాల్గొన్నారు.


