భువనగిరిటౌన్ : ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుందామంటే సాంకేతిక కారణాలతో కావడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు గృహ వినియోగ సిలిండర్ల సరఫరా ఏకంగా 50 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులుదీరుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం కనీస నిరీక్షణ సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అయితే, చివరి డెలివరీ తర్వాత 25 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నించే కస్టమర్లను నిరోధించే వ్యవస్థ టెలికం నెట్వర్క్ స్థాయిలో లేకపోవడంలో, ప్రతి కాల్ ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ అప్లికేషన్లకు చేరుతోంది. ఈ అసాధారణ ట్రాఫిక్ వల్ల మొత్తం నెట్వర్క్ స్తంభించిపోయింది. ఫలితంగా ఫోన్ కాల్స్ కలవక, సిలిండర్లు అందక జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
50శాతం తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్
గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరా సగానికి పడిపోగా, డిమాండ్ మాత్రం 50 శాతం పెరిగింది. బుకింగ్ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వస్తున్న జనం, అక్కడ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. గతంలో ఒకట్రెండు రోజుల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు వారం దాటినా రాకపోవడంతో సామాన్యులు గోదాముల వద్దకు వెళ్లి నేరుగా సిలిండర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.


