నల్లగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(62) పని నిమిత్తం గురువారం నల్లగొండకు వచ్చింది. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు గాను బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి నల్లగొండ బస్టాండ్లోకి వస్తూ సుభాష్ విగ్రహం వద్ద దేవకమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమార్తె పబ్బతిరెడ్డి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
కోర్టులో స్పృహతప్పి
పడిపోయిన వ్యక్తి
రామగిరి(నల్లగొండ): నల్లగొండ కోర్టులో గురువారం ఓ వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన బండారు నర్సింహారెడ్డి కేసు నిమిత్తం నల్లగొండ జిల్లా కోర్టుకు వచ్చాడు. ఉన్నట్టుండి అతడికి చెమటలు పట్టి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు కోర్టులో ఉన్న డిస్పెన్సరీకి తీసుకెళ్లి ఈసీజీ తీయగా హార్ట్ఎటాక్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో 108 వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


