మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గురువారం నాలుగో రోజు పోటీలను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య, గొల్ల రామశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాటక రంగంలో మిర్యాలగూడ ఖ్యాతిని ఢిల్లీ వరకు చాటిన స్థానిక కళాకారుల కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి చెరిగిపోని చిరునామా, విశాఖపట్నం నటరాజ డ్రమాటిక్ అసోసియేషన్ వారి నీళ్లు నీళ్లు, వరంగల్ మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారి వివాహ బంధం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డులు అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.


