భువనగిరిటౌన్ : కొత్త ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నెలలు గడుస్తున్నా మంజూరు కాకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27నెలలు కావస్తున్నా ఇంకా చేయూత పింఛన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకోనున్న నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది.
12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57–64 ఏళ్ల వయస్సు ఉన్న వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆసరా దరఖాస్తులతో పాటు 57– 64 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఒకేసారి పింఛన్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదు. లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. వృద్ధాప్య పింఛన్న్దారులు మృతి చెందితే వారికి వచ్చే పింఛన్ వెంటనే నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం తిరిగి పింఛన్ మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 12 వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆఫ్లైనన్లో వచ్చిన దరఖాస్తులు క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోకుండా కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తమకు ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయంటూ దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఫ కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు
ఫ అధికారంలోకి వచ్చి 27నెలలు కావొస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం


