భువనగిరిటౌన్ : ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రత్యేక అధికారులు రోజూ పాఠశాలకు వెళ్లి భోజనాన్ని స్వయంగా రుచి చూసి, నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా లేదా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు.
సాంకేతిక విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యం
ఆలేరు: ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వల్పకాలిక కోర్సులను మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణితో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఈ కోర్సుల్లో శిక్షణ అనంతరం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈకార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బీజన భాస్కర్ పాల్గొన్నారు.
భూభారతి కేసులో మరో నలుగురు రిమాండ్
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన భూ భారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంలో రిమాండ్ సంఖ్య 19కి చేరింది. కొద్ది రోజుల క్రితం జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుర్చగా, నాలుగు రోజుల క్రితం జనగామ పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాకు చెందిన సర్పంచ్ దొమ్మాట బాబు, లింగస్వామి, భానుప్రకాశ్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
మహాశివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నిత్య పూజలను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామ లింగేశ్వరస్వామి వారి ఆలయలో శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు, కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయ బద్ధంగా చేపట్టారు. సాయంత్రం సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే స్వామి వారిని మేల్కొలిపి, సుప్రభాత సేవలు, అర్చనలను అర్చకులు చేశారు. గర్భాలయంలోని స్వయంభూవులకు అభిషేకాలను నిర్వహించారు. ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.


