చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తా
● ఎమ్మెల్యే మందుల సామేల్
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువులోని కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తామని, మున్సిపల్ సుందరీకరణకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.13 కోట్లతో డీపీఆర్ రూపొందిస్తున్నారని, పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో రూ.2.50 కోట్లతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంల అభివృద్ధితో పాటు శివారు గ్రామాలైన ఆరెగూడెం, రాజన్నగూడెం, ధర్మాపురం, కొండాపురం, జామచెట్లబావి అభివృద్ధి కోసం పాటు పడతానన్నారు. మోత్కూరు మినీ ట్యాంక్బండ్ చెరువు కట్ట రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, వంగాల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల, జిల్లా నాయకులు అవిశెట్టి అవిలుమల్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, చింతల విజయభాస్కర్రెడ్డి, కంచర్ల యాదగిరిరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం జయశ్రీ, అన్నెపు పద్మ, కుర్మిళ్ల ప్రమీల, మందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణగిరిని దర్శించుకున్న
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ సందర్శించారు. ఈసందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి తదితరులున్నారు.
బేకరీ యాజమాన్యానికి
రూ.5వేల జరిమానా
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న బెంగళూరు బేకరీని ఆదివారం కస్టమర్ల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు పరిశీలించారు. బేకరీ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యానికి రూ.5వేల జరిమానా వేసినట్లు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యేనేపల్లి యాదగిరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
కోతులు, కుక్కల దాడిలో
ఏడుగురికి గాయాలు
అర్వపల్లి : మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కాసర్లపహాడ్, అడివెంల తదితర గ్రామాలకు చెందిన ఏడుగురిని ఆదివారం కోతులు, కుక్కలు కరిచి గాయపర్చాయి. కోతుల దాడిలో నలుగురు, కుక్కల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నాగయ్య, అంజయ్య, లింగమ్మ, సూరమ్మ, అంజమ్మ, తేజశ్రీ, శేఖర్ ఉన్నారు.
చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తా


