
బాలికలు, వృద్ధులకు ప్రత్యేక సంఘాలు
కొత్త ఎస్హెచ్జీల ఏర్పాటుకు కసరత్తు
అర్హులను గుర్తిస్తున్నాం
నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 14,8450 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో 1,65,258 మంది సభ్యులున్నారు.
భువనగిరి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) మరింత విస్త్రతం కానున్నాయి. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల నెట్వర్క్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ –2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటానికి సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
పొదుపు, బ్యాంకింగ్
లావాదేవీలపై అవగాహన
15–18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే డబ్బు పొదుపు చేయడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేదింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం కిశోర బాలికలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో బాలికలను చేర్పించేందుకు సెర్ప్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం
ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 సంవత్సరాలు నిండిని వారిని తొలగిస్తున్నారు. వీరితో మళ్లీ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలు ఉంటే వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేస్తోంది.
దివ్యాంగులంతా ఒకే గొడుకు కిందికి..
దివ్యాంగులందరినీ ఒకే గొడుకు కిందికి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు.
ఫ 15–18 ఏళ్ల వయసున్న బాలికలు,
60 ఏళ్లు నిండిన మహిళలతోప్రత్యేక గ్రూప్లు
ఫ దివ్యాంగులతో సైతం..
ఫ స్వయం సహాయక సంఘాల మాదిరిగా బ్యాంక్ లింకేజీ రుణాలు
ఫ కొనసాగుతున్న అర్హుల గుర్తింపు
ఫ నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంక్ ఖాతాలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. .
–నాగిరెడ్డి, డీఆర్డీఓ
మండలాలు 17
మొత్తం సంఘాలు 14,850
సభ్యులు 1,65,258
మండల సమాఖ్యలు 17
జిల్లా సమాఖ్య 01