
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నకిరేకల్: తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులోని ఆర్లగడ్డగూడెంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన నర్సింగ్ అంజమ్మ(70) తన తమ్ముడు ఎల్లయ్యకు రాఖీ కట్టేందుకు శనివారం నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడేనికి వచ్చింది. తమ్ముడికి రాఖీ కట్టాక ఊర్లో పెళ్లి ఊరేగింపు జరుగుతుండడంతో అంజమ్మ రోడ్డు పైకి వచ్చింది. ఈ క్రమంలో అంజమ్మ రోడ్డు దాటుతుండగా.. నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు.
నిషేధిత పాన్ మసాలాలు,
సిగరెట్లు స్వాధీనం
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు ఆదివారం పలు కిరాణా దుకాణాల్లో, పాన్ షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పాన్ మసాలాలు, సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన సిగరెట్లు, గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మన్మథకుమార్ హెచ్చరించారు.
మాంసం విక్రయ
దుకాణాల్లో తనిఖీలు
కోదాడరూరల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని మాంసం విక్రయ దుకాణాల్లో ఆదివారం మున్సిపల్ సిబ్బందితో కలిసి కోదాడ పశువైద్యాధికారి పెంటయ్య తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో 35 చోట్ల మటన్, 9 చోట్ల పశుమాంసం, ఐదు చోట్ల పంది, మరో 9 చోట్ల చేపలను విక్రయిస్తున్నారని వారు గుర్తించారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు ఆయా జంతువులను పశువైద్యాధికారులు పరీక్షించి ఆరోగ్యంగా ఉందని సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాతే వధించి మాంసం విక్రయించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది రాజయ్య, బాబురావు, ఆనందరావు ఉన్నారు.
రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
కనగల్: 1979లో పోలీస్ ఉద్యోగంలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీస్ ఉద్యోగులు ఆదివారం కనగల్ మండల శివారులోని పాశం పుల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగం చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరస్వామిగౌడ్, చెన్నారెడ్డి, నజీర్, నిజాం, వీరారెడ్డి, చంద్రారెడ్డి, జనార్దన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అంతయ్య, సంజీవరెడ్డి, జబ్బార్, నజీముద్దీన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
నాగారం: సూర్యాపేట–జనగామ రహదారిపై నాగారం మండలం ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన గొలుసుల నరేష్(27) తిరుమలగిరి నుంచి బైక్పై తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి సూర్యాపేటకు పని నిమిత్తం వెళ్తుండగా.. ఫణిగిరి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రశాంత్ను చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు.

సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..