
నీళ్లు లేవు.. నీడా లేదు!
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కొరత
వాచ్మన్ కూడా లేడు
గుండాల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాం. రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదు. ఎండలకు అవస్థలు పడుతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీటి కోసం సమీపంలోని వాటర్ప్లాంటుకు వెళ్తున్నాం. నీడ సౌకర్యం లేకపోవడంతో పక్కనే ఉన్న ఆలయానికి వెళ్లి సేద దీరుతున్నాం. నైట్ వాచ్మన్ను లేకపోవడంతో రాత్రి వేళలో ధాన్యం వద్దే కాపలా కాయాల్సి వస్తోంది.
–మచ్చ మధిరమ్మ, గుండాల
గన్నీ బ్యాగులు ఇవ్వలేదు
పది రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చా. ఇంత వరకు కొనుగోలు చేయలేదు. గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. ఎండలు మండిపోతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. టార్పాలిన్న్లతో చిన్నపాటి గుడారం ఏర్పాటు చేశారు. కానీ, టార్పాలిన్లు ప్లాస్టిక్వి కావడంతో సేదదీరే పరిస్థితి లేదు.
–జొన్నవాడ భాస్కర్రెడ్డి, భట్టుగూడెం
సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాత నానా యాతన పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడిచినా ఇంకా సౌకర్యాలే కల్పించలేదు. చాలా చోట్ల తాగునీటి వసతి లేకపోవడంతో మండుటెండలకు రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. నీడ సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. కూర్చోడానికి కుర్చీలూ లేవు. మరుగుదొడ్లు, టాయిలెట్లు అరకొరగా ఉన్నాయి.వీటితో పాటు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం తేమ చూసేందుకు మాయిశ్చర్ యంత్రాలు, తూర్పార పట్టేందుకు ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 372 కొనుగోలకు గాను ఇప్పటి వరకు 342 కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఏ ఒక్క చోట పూర్తిస్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు కేంద్రాల్లో సమస్యలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
● బీబీనగర్ మండలం భట్టుగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వందకు పైగా వడ్ల రాశులు నిల్వ ఉన్నాయి. కేంద్రాన్ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. కానీ, కొనుగోళ్లు చేయడం లేదు. నీరు, నీడ సౌకర్యం లేదు.
● వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం సమకూర్చిన ప్యాడీ క్లీనర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకుంటున్నారు. మహిళా రైతులకు టాయిలెట్ సౌకర్యం లేదు. అక్కంపల్లి ఐకేపీ సెంటర్లో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడం లేదు. టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు.
● మోత్కూరు మండలం పాటిమట్ల ఐకేపీ కేంద్రంలో నీడ సౌకర్యం లేదు. కొనుగోళ్లు మందకొడిగాసాగుతున్నాయి.
● ఆలేరు మండలం టంగుటూరులో డ్రమ్ములు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. ఎండ వేడికి నీరు వేడెక్కుతుండడంతో రైతులు తాగలేకపోతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచలేదు. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో కిరాయికి తెచ్చుకుంటున్నారు.
ఫ తాగునీటికి కటకట, చెట్ల నీడే దిక్కు
ఫ ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్లకూ అవస్థలు
ఫ కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
ఫ వర్షాలకు తడస్తున్న ధాన్యం
ఫ నష్టపోతున్న రైతులు
కేంద్రం ప్రారంభించడంతోనే సరి..
బొమ్మలరామారం మండలం హాజీపూర్ కొనుగోలు కేంద్రానికి 20 రోజుల నుంచే ధాన్యం రాక మొదలైంది. 22వ తేదీన కేంద్రాన్ని ప్రా రంభించారు. కానీ, ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. ఈనెల 25వ తేదీ నాటికి 30 మంది రైతుల ధాన్యం కుప్పలు కేంద్రంలో ఉన్నాయి. తాగడానికి కేవలం రెండు క్యాన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడం, తూర్పార పట్టే మిషన్లు లేకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు గాను తూర్పారపట్టే యంత్రాంగానికి గంటలకు రూ.1400 వరకు చెల్లిస్తున్నారు. ఇక నీడ సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న వేప చెట్టు కింద రైతులు సేదదీరుతున్నారు.

నీళ్లు లేవు.. నీడా లేదు!

నీళ్లు లేవు.. నీడా లేదు!

నీళ్లు లేవు.. నీడా లేదు!