
టైర్ల షాపులో అగ్నిప్రమాదం
మిర్యాలగూడ అర్బన్: ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు పూర్తిగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు మచ్చ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ విజయలక్ష్మి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు లోపలి నుంచి పొగలు వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు షాపు యజమాని మచ్చ శ్రీనివాస్కు సమాచారం అందించారు. షాపు వద్దకు వచ్చిన శ్రీనివాస్ తాళం తీసి చూడగా అప్పటికే టైర్లకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో వందకు పైగా రీ బాటమ్ చేసిన టైర్లు దగ్ధం కాగా వర్క్ షాపులోని మిగతా సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో మొత్తం రూ.16 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.