భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో చివరి దశలో ఉన్న 30 గ్రామాల రీ–సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో మండల సర్వేయర్లతో మంగళవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల సమక్షంలోనే సర్వే జరిపి, భూ వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రతి రైతుకు 9(2) నోటీసులు అందజేసి, ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయించాలన్నారు. అనంతరం సర్వే శాఖ నుంచి జిల్లాకు అందిన అధునాతన ల్యాప్టాప్లను 20 మండలాల సర్వేయర్లకు కలెక్టర్ పంపిణీ చేశారు. సర్వే డేటాను ఎప్పటికప్పుడు ల్యాప్టాప్లలో నమోదు చేసి భద్రపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.ఆర్. కల్పశ్రీ, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ప్రత్యేక సంక్షిప్త సవరణ రోల్ అబ్జర్వర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం నియోజకవర్గ ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిష్కారంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు
2027లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలకు విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం మంత్రులు, పుష్కరాల ప్రత్యేకాధికారి, ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.ఆర్. కల్పశ్రీ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ చదలవాడ నాగరాణి


