పోలవరం రూరల్: గూటాల గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మ రామకృష్ణ సోమవారం సొంత ఖర్చులతో 48 స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ పాఠశాల విద్యార్థులు క్రీడా రంగంలో చూపుతున్న ప్రతిభను వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఆయన, క్రీడా సామగ్రి కొరతను తీర్చాలని నిర్ణయించుకున్నారు. గతంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి.మధు కిషోర్ ఈ విషయాన్ని రామకృష్ణ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏలూరు నుంచి పాఠశాలకు విచ్చేసిన రామకృష్ణ, విద్యార్థులకు స్వయంగా ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఆయన్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన భీమవరం పట్టణంలోని భారతీయ విద్యా భవన్ స్కూల్లో సీనియర్ బాల, బాలికల డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలెక్షన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెలెక్షన్లు జరుగుతాయన్నారు. సెలెక్షన్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుు పాల్గొంటారని తెలిపారు.
చింతలపూడి: ఆయిల్పామ్ తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన చింతలపూడి మండలంలోని కమలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన చవటపల్లి పుల్లయ్య (40) కూలీ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కమలాపురం గ్రామానికి చెందిన అప్పలరాజు ఆయిల్పామ్ తోటలో గెలలు కోసేందుకు వెళ్లాడు. తోటలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పుల్లయ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరం: భావి పౌరుల ఆరోగ్య రక్షణ కోసం భీమవరం పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వెల్ఫేర్ గృహాల్లోని విద్యార్థినులకు ఉచితంగా హెపటైటిస్–బి, హెచ్పీవీ నివారణ టీకాలు వేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గరల్స్ కన్వీనర్ బి సింధు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ చర్యలు సక్రమంగా లేవన్నారు. విద్యార్థినుల కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్నందున వారి ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికి ఉచితంగా హెచ్పీవీ, హెపటైటిస్–బి నివారణ టీకాలను వేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు పి.సాయికృష్ణ, లీల తదితరులు పాల్గొన్నారు


