నరసాపురం: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అందే రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా కమిటిని ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడుగా పెన్నెత్స బాబుశ్రీ, అసోసియేట్ అధ్యక్షుడిగా బోనం పాండురంగారావు, ప్రధాన కార్యదర్శిగా కొటికలపూడి చిట్టి వెంకయ్య, కార్యదర్శిగా షేక్ సిలార్ సాహెబ్, కోశాధికారిగా కొట్రెడ్డి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మేళం దుర్గాప్రసాద్, అల్లూరి కరుణాకర్, నల్లం నాగేశ్వరరావు, యర్రంశెట్టి వెంకటరత్నం, వలవల రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నికయ్యారు. ఏపీ విశ్రాతం ఉద్యోగుల సంఘ నాయకుడు రుద్రరాజు రామకృష్ణరాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.రాష్ట్ర అధ్యక్షుడు కుకుమారి రామచంద్రరావు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
భీమవరం: ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈనెల 28న విజయవాడలో తలపెట్టిన ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ కోరారు. ఆదివారం భీమవరంలో నిర్వహించిన సమావేశంలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉద్యమమే శరణ్యమని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనరల్ సెక్రటరి అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్పర్సన్ డి.సుగుణ సంధ్య, వైస్ చైర్మన్ బి.అరుణ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఏపీసీఎస్ఏ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీకి అ మరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులంతా వచ్చేనెల 1న ర్యాలీకి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది పెన్షన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని, రిటైర్ అయిన తర్వాత వారి పరిస్థితి అధ్వానంగా ఉందని, సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


