నూజివీడు: సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ సూచించారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఈ నెల 24న జరగనున్న ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, ఆయన నూజివీడులో విలేకరులతో మాట్లాడారు. నూజివీడు సర్కిల్ పరిధిలో ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, వీసాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, అలాంటి మాటలు నమ్మొద్దని, అలా ఎవరైనా చేస్తే వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్లో తెలపాలన్నారు. ఇళ్లల్లో ఎక్కువ మొత్తంలో బంగారం, నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలన్నారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ దిగుబడుల విక్రయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారుల వివరాలను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
నూజివీడులో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడం, ఆర్టీసీ బస్సులను నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని సీఐని ఆదేశించారు. తోపుడు బండ్లు, పండ్ల దుకాణాలకు ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రాంతాలను కేటాయించాలన్నారు. ప్రజలు, వ్యాపారులు బాధ్యతగా వ్యవహరిస్తే సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐ ఐవీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.


