లింగపాలెం : ఆరుగాలం శ్రమించి ఆయిల్ పామ్ పండిస్తున్న రైతులను దళారీ వ్యవస్థ నిలువునా ముంచుతోంది. లింగపాలెం మండలంలోని కొన్ని వే–బ్రిడ్జిల వద్ద దళారులు తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారు. నవభారత్, గోద్రేజ్ ఫ్యాక్టరీలకు తరలించే గెలల విషయంలో వీరు భారీ మోసానికి తెరతీశారు. పగటిపూట రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆయిల్ పామ్ గెలలను వే–బ్రిడ్జిల వద్ద ఉంచి, రాత్రివేళ వాటిపై విచ్చలవిడిగా నీళ్లు చల్లుతున్నారు. తద్వారా కృత్రిమంగా బరువు పెంచి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఫ్యాక్టరీల వద్దకు చేరాక గెలల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో యాజమాన్యాలు ధరలో కోత విధిస్తున్నాయి. దళారుల కక్కుర్తి కారణంగా గత నెలలోనే టన్నుకు రూ. 450 చొప్పున ధర తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.


