జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరంలో చిన్నపెద్ద చెరువులో మట్టిని తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. భారీ జేసీబీలు పెట్టి, పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు సోమవారం అర్థరాత్రి జేసీబీలు, టిప్పర్లను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, జంగారెడ్డిగూడెం పోలీసులు 8 టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి అక్రమ మట్టి రవాణాకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఒక్కొక్క వాహనానికి రూ.7500 జరిమానా విధించారు. ఇటీవలే అదే చెరువులో ఒక రైతు తన పొలాన్ని ఎత్తు పెంచుకునేందుకు మట్టి తోలుకుంటుండగా, అధికారులు ట్రాక్టర్ను సీజ్ చేసి రూ. 25 వేలు జరిమానా విధించారని తెలిసింది. రైతు సేద్యం కోసం మట్టి తోలుకుంటుంటే భారీ పెనాల్టీ విధించి, అక్రమ రవాణా చేస్తున్న మట్టి మాఫియాకు మాత్రం తక్కువ జరిమానా విధించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తమ టిప్పర్లను సీజ్ చేసినంత మాత్రాన తమకు ఏమవుతుందని, మళ్లీ అదే చెరువులో మట్టి రవాణా చేస్తామని మట్టి మాఫియా సవాల్ చేస్తోంది.
8 టిప్పర్ల సీజ్


