
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో ఉపాధి హమీ పథకం పనుల కల్పనకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చర్యలు చేపట్టారు. జిల్లాలో పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలకు సంబంధించి 16 గ్రామాలు ఆయా మున్సిపాలిటిల్లో విలీనం చేశారు. దాంతో ఆయా గ్రామాలు పట్టణ పరిధిలోకి రావడంతో అక్కడ ఏడాదికి పైగా ఉపాధి పనులు నిలిపేశారు. గ్రామాల విలీనంపై అభ్యంతరాలు రావడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దాంతో విలీనం గ్రామాల్లో కూడా ఉపాధి హమీ పనులు కల్పించి ఆయా గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పనులు కల్పించాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు.
పనులకు శ్రీకారం
పట్టణాల్లోని విలీన గ్రామాల్లో శుక్రవారం నుంచే ఉపాధి పనులకు డ్వామా అధికారులు శ్రీకారం చుడుతున్నారు. భీమవరం మున్సిపాలిటీలో కొవ్వాడ అన్నవరం, చిన అమిరం, రాయలం, తాడేరు, పాలకొల్లు మున్సిపాలిటీలో భగ్గేశ్వరం, పూలపల్లి, ఉల్లంపర్రు, అడవిపాలెం, వరిధనం, యాళ్లవానిగరువు, కొంతేరు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో కుంచనపల్లి, ఎల్.అగ్రహరం, పడాల, పత్తిపాడు గ్రామాలు విలీనమయ్యాయి. ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 2500 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వారికి నేటి నుంచి ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించనున్నారు. ఏడాదికి పైనే ఉపాధి పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి పనులు ఉపయోగపడనున్నాయి.
మున్సిపాలిటీ విలీన ఉపాధి కూలీలు
గ్రామాల జాబ్
సంఖ్య కార్డులు
భీమవరం 5 557 772
పాలకొల్లు 7 481 603
తాడేపల్లిగూడెం 4 776 1,211
3 మున్సిపాలిటీల్లో 15 గ్రామాల విలీనం
సుమారు 2,500 మందికి పనుల కల్పన
ఉపాధి పనులు చేపడుతున్నాం
కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో విలీనమైన 16 గ్రామాల్లో ఉపాధి పథకం పనులు చేపడుతున్నాం. శుక్రవారం నుంచే ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభిస్తున్నాం. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో కూలీలకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయి అధికారులకు ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు పక్కాగా జరిగేలా అదేశాలు ఇచ్చాం.
– ఎస్టీవీ రాజేశ్వరరావు, డ్వామా పీడీ
