హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: నోటీసులు జారీ అయిన ఓటర్లతో విచారణ అనంతరం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై గురువారం కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఆర్డీఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల స్వీకరణ, వాటిని డీఈఓ/కలెక్టర్ లాగిన్కు పంపే అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి..
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ భూసేకరణ కేసులను సంబంధిత రైతులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. పరకాల డివిజన్లో జాతీయ రహదారులకు సంబంధించి చేపట్టాల్సిన భూసేకరణపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, పరకాల డివిజన్ తహసీల్దార్లు పాల్గొన్నారు.
త్వరగా పూర్తి చేయండి: బల్దియా కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: ‘భద్రకాళి బండ్ అభివృద్ధి ప నులు ఇంకా ఎన్నేళ్లు చే స్తారు’ అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన బల్దియా ఇంజనీరింగ్, ‘కుడా’ అధికారులతో కలిసి బండ్పై కొనసాగుతున్న పనులు తనిఖీ చేశారు. బండ్పై నిర్మిస్తున్న టాయిలెట్లు, పరిసరాల సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తనీఖీల్లో ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు.


