కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులను అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్రెడ్డి.. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.
సాంకేతిక లోపంతో పాలు విరిగాయి
● విజయ డెయిరీ, వరంగల్ డీడీ ధన్రాజ్
హన్మకొండ చౌరస్తా: డెయిరీలోని మిషనరీలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణం, పాల శీతలీకరణ ప్రక్రియలో అంతరాయం వల్లనే పాలు విరిగినట్లు గుర్తించామని విజయ డెయిరీ వరంగల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ధన్రాజ్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన ‘విరిగిన విజయ డెయిరీ పాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై డెయిరీ డీడీ స్పందించారు. శనివారం హహనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలో విజయ డెయిరీ కార్యాలయంలో డెయిరీ పరిధిలో పాలు సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, పాడి రైతుల సంఘం బాధ్యులు, డెయిరీ ఉద్యోగులతో డీడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత మిషనరీ పూర్తిగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు, సాంకేతిక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ డెయిరీ వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, మార్కెట్లో పాల సరఫరా, నిల్వ, శీతల సరఫరా వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు.
● కేయూ వీసీ ఆచార్య
ప్రతాప్రెడ్డి


