కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో రెండు ఎక్స్రే మిషన్లు గురువారం పనిచేయక రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈవిభాగంలో మూడు ఎక్స్రే మిషన్లు ఉండగా.. వారం క్రితం ఒక మొబైల్ ఎక్స్రే మిషన్ పాడైపోయింది. దీనికి మరమ్మతులు చేయకముందే మరో మినీ డిజిటల్ ఎక్స్రే మిషన్ గురువారం నుంచి పనిచేయట్లేదు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక మిగిలిన ఒకే ఒక డిజిటల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రేలు తీశారు. దీంతో పేషంట్లు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎక్స్రే రిపోర్ట్ వచ్చే వరకు సంబంధిత డాక్టర్ ఉంటారో? లేదో? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే మిషన్పై మూడు మిషన్లకు సంబంధించిన ఎక్స్రేలు తీయడం వల్ల లోడ్ పెరిగి సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎక్స్రే మిషన్లకు మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు.
పోలీసులకూ తప్పని తిప్పలు..
ఎంజీఎంలోని రేడియాలజీ విభాగంలో ఎక్స్రే ఫిలిం కొరత వేధిస్తోంది. మెడికో లీగల్ కేసుల విషయంలో తప్పనిసరిగా ఎక్స్రేకు సంబంధించిన ఫిలిం అవసరం. ఆస్పత్రి అధికారుల ఆదేశాల మేరకు ఎంఎల్సీ కేసులకు ఎంజీఎం సిబ్బంది కేవలం రిపోర్ట్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. మెడికో లీగల్ కేసుల విషయంలో రిపోర్ట్ తీసుకోవడంతో పాటు ఫిలింను వైద్యుల పర్యవేక్షణలో రేడియాలజీ విభాగంలో భద్రపర్చాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ కేసులు కోర్టులో ఉన్నప్పుడు జడ్జికి తప్పనిసరిగా రిపోర్టుతో పాటు ఫిలిం చూపించాలి. ఎంజీఎంలో ఫిలిం ఇవ్వకపోవడం వల్ల కోర్టులో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని, బాధితులకు సంబంధించిన ఎక్స్రే ఫిలింలు తీసి, ఆస్పత్రిలో భద్రపర్చాలని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తాము కోర్టు, పోలీస్ స్టేషన్, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.


