● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో వెట్ల్యాండ్స్ (చిత్తడి నేలలు) సంరక్షణ, గుర్తింపు నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వెట్ల్యాండ్ కమిటీ సమావేశాన్ని డీఎఫ్ఓ నిఖితతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 433 వెట్ల్యాండ్స్కి సంబంధించిన సరిహద్దుల నిర్ధారణ, సంయుక్త క్షేత్ర పరిశీలన పనులు వేగవంతం చేయాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి రాష్ట్ర వెట్ ల్యాండ్ అథారిటీకి నివేదికలను సకాలంలో పంపించాలని సూచించారు. గుర్తించిన 7 వెట్ల్యాండ్స్ సరిహద్దులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేచేయించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత మాట్లాడుతూ ఇప్పటి వరకు నీటిపారుదలశాఖ 129 వెట్ల్యాండ్స్ సంబంధించిన వివరాలను సమర్పించాలని, మిగిలిన వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తిచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయశాఖాధికారి విజయ్భాస్కర్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్రావు, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
‘సర్’పై కలెక్టర్ సమీక్ష
ఎస్ఐఆర్–2026 ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సలహాలు, అభ్యంతరాలను ఎన్నికల నిబంధనల మేరకు సమర్పించాలని సూ చించారు. అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హుల వివరాలను కూడా నిబంధనల ప్రకారం పరి శీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, రజినీకాంత్, కుసుమ శ్యాం, ఫైజుల్లా, రాజేశ్, సుల్తాన్ పాల్గొన్నారు.


