హన్మకొండ కల్చరల్: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల ఆలయానికి పునర్వైభవం తీసుకురావడమే పురావస్తుశాఖ లక్ష్యమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్ అన్నారు. హనుమకొండకు చెందిన ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి సౌజన్యంతో రూ.10 లక్షలతో దేవాలయం మెట్ల నుంచి గర్భాలయం, నాట్యమండపం చుట్టూ నూతనంగా క్యూలైన్లను నిహీల్దాస్ పురావస్తుశాఖ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కల్యాణ మండపం చుట్టూ ప్రదక్షణ పథం, విరిగిన ద్వారపాలకుల శిల్పాలను శిల్పులతో తిరిగి చెక్కించేందుకు పూజలు నిర్వహించారు. గార్డెన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా నిహీల్దాస్ మాట్లాడుతూ.. వర్షపు నీరు లీకవ్వకుండా రూ.30 లక్షలతో కల్యాణ మండపం పైకప్పు పనులు, నంది మంటపం నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, పురావస్తుశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, సీనియర్ సీఐ అజిత్, మల్లేశం, కాంట్రాక్టర్ శ్రీనివాస్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్
దేవాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం


