ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు.
ఎంజీఎం: మహిళలు సవాళ్లను అధిగమించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని సీనియర్ డాక్టర్లు కూరపాటి రాధిక, రమేశ్ పిలుపునిచ్చారు. వరంగల్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు సంకల్పం, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తాటి సునీత, ఫ్యాకల్టీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీఎం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వైద్య నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో ఈనెల 6వ తేదీ నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే శిబిరాల్లో ఎంజీఎం ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి నుంచి సీ్త్ర వైద్యులు, పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలందిస్తారని పేర్కొన్నారు. మరింత ఉన్నతమైన సేవల కోసం రెఫర్ చేసిన వారిని ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఫాలోఅప్ సేవలు అందిస్తారని చెప్పారు. 14 ఏళ్ల బాలికలకు ఈనెల 8 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


