కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్
పరకాల: ‘కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేశారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారంటీలను బాండ్ పేపర్పై రాసిచ్చి వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను చొక్కా పట్టుకొని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం పరకాలలో బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో తరలిరావడంతో అంబేడ్కర్ సెంటర్ కూడలి సభాప్రాంగణాన్ని తలపించింది.
కేసీఆర్ను తిట్టడమే లక్ష్యమా?
ఈ రోడ్డుషోలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి తెల్లారి లేస్తే కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి పరిపాలనలో పూర్తి విఫలమయ్యారని, అందుకే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ‘అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయినట్లుగా ‘మార్పు అన్న ప్రజల్లారా.. ఈ రోజు ఆగమయ్యారా లేదా’ అని ప్రజలను ప్రశ్నించారు. ఏ ఓక్క హామీని అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్ల పాలనలో పరకాల అభివృద్ధికి ఏం చేశావని రేవూరి ప్రకాశ్రెడ్డి ఓట్లు అడుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కేసీఆర్తో కొట్లాడి వందల కోట్లతో పరకాల అభివృద్ధికి కృషిచేశారని అందుకే ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకుని బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు.
పరకాల అభివృద్ధి నిర్వీర్యం
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గతంలో నర్సంపేటను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ పరకాల నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి అసలు నర్సంపేటలో ఎన్ని గ్రామాలు.. ఎన్ని తండాలు ఎక్కడున్నాయో కూడా తెలియదన్నారు. పరకాల అభివృద్ధి అంటూ నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. పరకాలలో ప్రతీ అభివృద్ధి కార్యక్రమం కేసీఆర్ ఆశీస్సులతో తాను చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప రేవూరి ప్రకాశ్రెడ్డి ఏం చేయలేదన్నారు. ప్రభుత్వ నూతన భవనాలకు రంగులు వేసి శిలఫలకాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, పరకాల మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జ్ వాసుదేవ్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు లింగంపల్లి కిషన్రావు, బీఆర్ఎస్ అభ్యర్థులు, మండల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
మాజీ మంత్రి కేటీఆర్
పరకాల మున్సిపల్ ఎన్నికల
ప్రచారం..భారీ రోడ్ షో
వేల సంఖ్యలో తరలివచ్చిన
కార్యకర్తలు, ప్రజలు
కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్


