
అభ్యంతరాలు తెలియజేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో
సమావేశం
హన్మకొండ అర్బన్: జిల్లాలో అన్ని జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో అభ్యంతరాలుంటే నేడు (శనివారం) నాటికి తెలియజేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలోని 210 జీపీల్లో 3,70,867 మంది ఓటర్లు, 1,986 పోలింగ్ కేంద్రాలున్నట్లు తెలిపారు. శనివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారిని తొలగించాలని ఆ జాబితాను బీఆర్ఎస్ ప్రతినిధి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, తదితరులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ. శ్రీనివాస్రావు, నిశాంత్, ప్రభాకర్రెడ్డి, రజినీకాంత్, ఎండీ నేహాల్, శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, ఏసోబు, తదితరులు పాల్గొన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో చర్చించిన అంశాలను ఎజెండాలో పొందుపర్చుతామన్నారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి గణేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నిర్మల, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, ఈ.వి శ్రీనివాస్రావు, చుంచు రాజేందర్, సింగారపు రవిప్రసాద్, హరి జవహర్లాల్, పరంజ్యోతి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఏసీపీలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులు త్వరగా
పరిష్కరించండి
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూభారతి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.