
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి
ఖిలా వరంగల్: భవిష్యత్లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని, నైపుణ్యాలను సాధించేలా, నూతన ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులకు బోధన చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ఫర్ అటల్ పీఎం, భౌతిక, గణిత శాస్త్రాలపై ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఉర్సు గుట్ట సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. డిజిటల్ లెర్నింగ్తో విద్యార్థులు 21వ శతాబ్దానికి తగిన నైపుణ్యాలు, జ్ఞానం పొంది భవిష్యత్ విద్యకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, ప్రభు, సురేశ్, గణేశ్, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
బాలల అక్రమ రవాణా అరికట్టాలి
బాలలపై అక్రమ రవాణా, దుశ్చర్యలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజులు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి 1098 చైల్డ్ లైన్ నంబర్ తెలిసి ఉండాలని, ఆపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు, వస్తువులు తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. బాలల అక్రమ రవాణా నివారణకు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, పాఠశాలల్లో చైల్డ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా మానిటరింగ్ అధికారి సుజన్తేజ, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఉజ్వల, సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అభ్యంతరాలు తెలియజేయాలి..
న్యూశాయంపేట: జిల్లాలోని అన్ని గ్రామపంచాయితీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 317 గ్రామపంచాయతీల పరిధిలోని 2754 వార్డుల్లో 3,83,736 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితా ఈనెల 28న విడుదల చేశామని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలను శనివారంలోపు తెలియజేస్తే పరిష్కరించి వచ్చేనెల 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద