
ఎట్టకేలకు వరుణుడి కరుణ
అత్యధిక, అధిక, లోటు వర్షపాతం ఉన్న మండలాల సంఖ్య ఇలా..
వరి సాగు ఇలా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరుణుడి కరుణతో ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలం సీజన్ మే లో ముందస్తుగా తొలకరి జల్లులు మురిపించాయి. ఆ వర్షాలకు సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు అత్యధికంగా పత్తి పంట వేశారు. ఆ తర్వాత జూన్ వరకు మేఘాలు ముఖం చాటేశాయి. జూలై రెండో వా రంలో అక్కడక్కడ జల్లులు పడినా, అంతగా ప్రయోజనం లేకపోగా పత్తి విత్తనాలు రెండు సార్లు వేసినా ఎండిపోయాయి. పది రోజుల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు వర్షపాతం ఉంది.ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊ రట కలిగిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 79మండలాల్లో శనివారం ఉదయం 8:30గంటల వరకు అధికారిక గ ణాంకాల ప్రకారం ఒక్క మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. 25 మండలాల్లో అధికం, 48 మండలాల్లో సాధారణం,మరో ఐదు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది.
ఇప్పటికీ ఐదు మండలాల్లో లోటు వర్షమే..
జూలై చివరినాటికి ఉమ్మడి జిల్లాలో 79 మండలాలకు గాను ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మి.మీ.లకు గాను 662.10 మి.మీ.ల(66శాతం)అధికంగా పడింది.25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురిసింది. 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్న ఆ జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. లోటు వర్షపాతం ఉన్న మండలాల జాబితాలో ములుగు జిల్లాల్లోని కన్నాయిగూడెం, వాజేడు, భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూ ర్ మండలాలు ఉన్నాయి. మహబూ బాబాద్ జిల్లాలో 18 మండలాలకు 8 మండలాల్లో అధికం కాగా,10 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.
సాగుపై వాన ప్రభావం..
తగ్గిన విస్తీర్ణం..
నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో తొలకరి జల్లులకే రైతులు సాగుబాట పట్టారు. ముందుస్తు వర్షాలు పడడంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు నాటారు. అయితే ఆ తర్వాత సుమారు నెలన్నర అసలు వర్షాలే పడకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయాయి. దీంతో ఈ సారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం 77.65 శాతానికే పరిమితమైంది. వానాకాలంలో 15,82,755 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 12,41,456 ఎకరాల్లోనే సాగు చేశారు. గతేడాది వానాకాలంలో 110 శాతంగా సాగు విస్తీర్ణం ఉండగా.. ఈ సారి 77.65 శాతాని కి పడిపోయింది. వరి, పత్తి సాగు కూడా గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అంచనా 5,79,863 ఎకరాలు కాగా తాజా గణాంకాల ప్రకారం 4,98,109 (85.90 శాతం)లలోనే సాగు చేశారు. అలాగే, వరి సాగు అంచనా 8,78,376 ఎకరాలు కాగా, శనివారం నాటికి 6,14,320 (69.94 శాతం)గా సాగు విస్తీర్ణం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆలస్యంగానైనా పడుతున్న వర్షాలు..
లోటునుంచి ఎక్సెస్ వైపు వర్షపాతం
ఉమ్మడి వరంగల్లో 25 మండలాల్లో
అధికం.. 48 మండలాల్లో సాధారణం
ఐదు మండలాల్లో ఇంకా లోటువర్షపాతమే..
వర్ధన్నపేటలో అత్యధిక నమోదు..
రైతులకు ఊరట
వానల ఆలస్యంతో తగ్గిన సాగు విస్తీర్ణం..
ఇప్పటివరకు 77.65 శాతమే
జిల్లా మండలాలు అత్యధిక అధిక సాధారణ లోటు
హనుమకొండ 14 – 02 12 –
వరంగల్ 13 01 08 04 –
మహబూబాబాద్ 18 – 08 10 –
ములుగు 10 – 02 06 02
జనగామ 12 – 04 07 01
జేఎస్ భూపాలపల్లి 12 – 01 09 02
మొత్తం 79 01 25 48 05
జిల్లా సాగు అంచనా సాగైన విస్తీర్ణం
( ఎకరాల్లో..)
హనుమకొండ 1,41,984 1,13,011
వరంగల్ 1,27,950 92,315
మహబూబాబాద్ 2,03,909 1,49,808
ములుగు 99,628 59,833
జేఎస్ భూపాలపల్లి 1,08,106 66,217
జనగామ 1,96,799 1,33,136
మొత్తం 8,78,376 6,14,320
పత్తి సాగు ఇలా..
జిల్లా సాగు అంచనా సాగైన విస్తీర్ణం
(ఎకరాల్లో..)
హనుమకొండ 92,028 74,849
వరంగల్ 1,28,343 1,18,106
మహబూబాబాద్ 89,219 78,745
ములుగు 24,513 19,431
జేఎస్ భూపాలపల్లి 99,948 98,260
జనగామ 1,45,812 1,08,718
మొత్తం 5,79,863 4,98,109
సకాలంలో వర్షాలు కురిస్తే బాగుండు
ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు పడలేదు. రోహిణి కార్తెలో వర్షాలు కురవడంతో చాలామంది రైతులు మొదట్లో విత్తనాలు నాటారు. అవి మొలకెత్తిన తర్వాత వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం సమయం మించిపోయిన తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడే సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటల సాగుకు రైతులకు అనుకూలంగా ఉండేది.
– రామంచ సుధాకర్, రైతు, పీచర

ఎట్టకేలకు వరుణుడి కరుణ