
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
రామన్నపేట: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆయా విభాగాల ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. ఎక్కువకాలం పెండింగ్లో ఉండకుండా చూడాలని, 24 గంటల వ్యవధిలోగా శానిటేషన్ విభాగానికి అందిన ఫిర్యాదులు పరిష్కారం కావాలని ఆదేశించారు. గార్బేజ్ బిన్లు లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పన్నుల విభాగానికి స్వీకరించిన ఫిర్యాదులు వారంలోగా పరిష్కారం చూపాలన్నారు. ఈనెల 21 వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో బోనాలు పండుగలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇంజనీరింగ్ 23, టౌన్ ప్లానింట్ 44, హెల్త్ – శానిటేషన్ 11లతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన మొత్తం 91 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.