9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్లు, ప్రొఫెసర్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేరుగా హజరుకాలేకపోతున్న వారి కోసం నిట్ అధికారిక యూట్యూబ్ అందుబాటులో ఉంటుందని వివరించారు.
నిట్ను అగ్రగామిగా
నిలబెడదాం
నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ మోహన్రెడ్డి
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ
కాజీపేట : కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు, ఈ–చలాన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా తిరగడం, మైనర్ డ్రైవింగ్ వంటి విషయాల్లో ఎవరిని ఉపేక్షించొద్దని సిబ్బందికి సూచించారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐ వెంకన్న, ఎస్సైలు కనక చంద్రం, రామారావు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీనుంచి 13వ తేదీలోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
పరిశోధనపత్రాల
ప్రొసీడింగ్స్ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈఏడాది మార్చి 11, 12వ తేదీల్లో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ యానిమల్ బయా టెక్నాలజీ అండ్ ఇమ్యునాలజీ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ జాతీయ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన 26 పరిశోధన పత్రాలతో కూడిన ప్రొసీడింగ్స్ (పుస్తకం)ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ షమిత, ఆ విభాగం ప్రొఫెసర్లు మామిడాల ఇస్తారి, డాక్టర్ వెంకయ్య, ఈసం నారాయణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య పాల్గొన్నారు.
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్


