భూ సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి
● కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం మండలంలోని కట్య్రాల, ఇల్లంద గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాస్ బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూముల్ని నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ పార్ట్ బి కింద చేర్చిన భూముల తదితర దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ద్వారా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రకియ పని తీరును పరిశీలించారు.
కొనుగోలు కేంద్రం సందర్శన
ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద , డీఆర్డీఓ పీడీ కౌసల్యదేవితో కలిసి పరిశీలించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, తహసీల్దార్ విజయసాగర్, ఏఓ రమేశ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్లో అడ్మిషన్లు పెంచేందుకు
కెరియర్ క్యాంపులు
న్యూశాయంపేట: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పెంచేందుకు కెరియర్ క్యాంపులు నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడతూ.. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో ఏయే కళాశాలలో తక్కువ శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుకు గల కారణాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్బోర్డు నియమ నిబంధన మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల భవనాలకు ఫైర్ సేప్టీ తదితర సర్టిఫికెట్టు తప్పనిసరిగా పొందాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్, డీఈఓ జ్ఞానేశ్వర్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
మూడు లే–ఔట్లకు అనుమతులు
కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన లేఔట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ పరిధిలో మూడు లేఔట్ అనుమతుల కోసం ప్రతిపాదన రాగా.. వాటిని కమిటీ నిబంధనలు అనుసరించి పరిశీలించి, సమావేశంలో చర్చించి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.


