చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్క‌రు..! | - | Sakshi
Sakshi News home page

చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్క‌రు..!

Feb 19 2024 5:50 AM | Updated on Feb 19 2024 12:38 PM

- - Sakshi

నెక్కొండ: జిల్లాలోని నర్సంపేట డివిజన్‌లోనే నెక్కొండ ఏకై క రైల్వే స్టేషన్‌. ప్రధాన పట్టణాలకు సమాన దూరంలో ఉండే ఈ స్టేషన్‌ను దాదాపు 150 ఏళ్ల క్రితం అప్పటి నిజాం ప్రభుత్వంలో ఎన్‌ఎస్‌ఆర్‌ (నిజాం స్టేట్‌ రైల్వే) పేరుతో ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ కంటే ముందు నడిచిన మణుగూరు, నాగ్‌పూర్‌, పెద్దపల్లి ప్యాసింజర్‌, లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ రద్దు కావడంతో ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. ఇటీవల నెక్కొండ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్‌–గుంటూరు, గుంటూరు–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల అప్‌ అండ్‌ డౌన్‌కు తాత్కాలిక హాల్టింగ్‌ను రైల్వేశాఖ కల్పించింది.

సరిపడా ఆదాయం వస్తేనే హాల్టింగ్‌ కొనసాగనుందని రైల్వే అధికారులు మెలిక పెట్టారు. గతంలో ఆదాయం లేదన్న సాకుతో అప్‌లైన్‌లో నడిచే గౌతమి, పద్మావతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దుతో కొందరు అప్రమత్తమయ్యారు. నెక్కొండ పట్టణానికి చెందిన గోరంట్ల వెంకట్‌నారాయణ, సొంటిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, అంబాల రాంగోపాల్‌, భూపతి వీరన్న, నేతుల సారంగపాణి, చల్లా నాగిరెడ్డి, ఇండ్ల రవి, నంగునూరి కృష్ణమూర్తి, మరికొందరు ముందుకు వచ్చారు.

‘నెక్కొండ రైల్వే టౌన్‌ టికెట్స్‌ ఫోరం’ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేశారు. నిధులు సమీకరించి, ప్రయాణికులకు అవగాహన కల్పించడంతోపాటు రైల్వేకు వీరు ఆదాయాన్ని తీసుకొస్తున్నారు. ఈ నిధుల నుంచి టికెట్లు కొనుగోలు చేసి పేద ప్రయాణికులు, ఇంటర్‌సిటీ రైలులో ప్రయాణించే కొందరికి అందిస్తున్నారు. అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement