వనపర్తి: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో (సీడబ్ల్యూఎస్ఎన్) అపారమైన జ్ఞానం, ప్రతిభ దాగి ఉంటుందని.. గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్ఎల్వీ గ్రాండ్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకుల జిల్లాస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి గర్వపడాలని సూచించారు. పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారు లక్ష్యాలు సాధించేలా నిరంతరం ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక అవసరాల వ్యక్తుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని.. దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు పింఛన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తోందని తెలిపారు. భవిత కేంద్రాల ద్వారా అవసరమైన శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐఆర్పీ(ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్స్) నిరంతరం పిల్లలకు సహకరిస్తూ అవసరమైన శిక్షణ అందిస్తున్నారన్నారు. దివ్యాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోందని.. 16వ తేదీ చివరి గడువని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రదర్శించిన వివిధ ప్రతిభా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పిల్లల్లోని సృజనాత్మకత, ప్రతి భను చూసి తల్లిదండ్రులు, అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఇత ర జిల్లా విద్యాశాఖ అధికారులు, భవిత కేంద్రాల సిబ్బంది, ఐఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


