వనపర్తి: ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మితే ఆగం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక రాజీవ్ చౌక్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఅర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం రావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, ఒక డిక్లరేషన్ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగస్తులు సీఎం రేవంత్రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రైతులు నమ్మి హరిగోస పడుతున్నారని, కరెంట్ కోతలు ఎప్పటిలాగే మారాయన్నారు. యూరియా కోసం రోడ్లపై పడిగాపులు పడాల్సివస్తుంది, నికర జలాలు ఆంధ్రావాళ్లు దోచుకుపోతుంటే రేవంత్ మొద్దు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసం రైతులను దగా చేస్తున్న సీఎంకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు.
లక్ష అబద్ధాలతో..
కాంగ్రెస్ పాలన 1000 రోజుల్లో లక్ష అబద్ధాలతో కొనసాగుతుందని, వైఎస్సార్ రూపొందించిన ఫీజురియింబర్స్మెంటును కేసీఅర్ కొనసాగిస్తే.. రేవంత్రెడ్డి అబాసుపాలు చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో 2లక్షల ఉద్యోగాలు అని చెప్పి గద్దెనెక్కి నేడు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ పాలనలో 2.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. చివరికి అవ్వాతాతలను మోసం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. సభాస్థలిలో ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను వివరిస్తూ 420 ఫీట్లు భారీ ఫ్లెక్సీ ప్రజలను ఆకర్షించింది.


