పాన్గల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సర్కార్ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా వైద్యాధికారి డా.భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని అన్నారం పల్లె దవాఖాన, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రోగులకు అందుతున్న సేవల తీరు, పీహెచ్సీలో మందుల స్టాక్ వివరాలను ఆయన పరిశీలించారు. జ్వర పీడితుల సర్వే, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, గర్భిణు నమోదు, వారికి అందుతున్న సేవలు, ప్రసవాల సంఖ్య, టీ–హబ్ నమూనా రిజిస్టర్లు, వ్యాక్సిన్ డ్యూ జాబితాపై ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణులకు ప్రసవ సమయం వరకు మెరుగైన వైద్యం అందిస్తూ పౌష్టికాహారం, వైద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో డెంగీ జ్వరాలు పెరగకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గ్రామస్తులకు నివారణ చర్యలపై అవగాహన పెంచుతూ పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జ్వర పీడితులు ముందుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు. విధులల్లో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ పరిమళ, పల్లె దవాఖాన వైద్యులు మైథిలీ, నిహరిక, నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


