వనపర్తి రూరల్: ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన ఇందిర కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో మధ్యాహ్నం షిఫ్ట్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ అపస్మారక స్థితిలోకి చేరి అక్కడే తుది శ్వాస విడిచారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శనివారం జిల్లా జనరల్ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర అధికారుల సమక్షంలో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులతో చర్చలు జరిపి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ, ఏజెన్సీ పరంగా కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కార్మికులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, ఏఐటీయూసీ నేతలు శ్రీరాములు, గోపాలకృష్ణ, భాస్కర్, సీపీఐ కార్యదర్శి రమేష్, మాజీ కౌన్సిలర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


