మదనాపురం: రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018, ఆగస్టు 15న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చింది. 59 ఏళ్లలోపు రైతు ఎలా మరణించినా నామినీకి రూ.5 లక్షల ఆర్థికసాయం అందేది. రైతు కుటుంబాలకు భద్రతా కవచంగా నిలిచే బీమా పథకం పునరుద్ధరణ ప్రక్రియపై జిల్లాలో తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. ఈ నెల 13తో గతేడాది చేసిన బీమా గడువు ముగియగా.. పునరుద్ధరణపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ పథకం కొనసాగుతుందా? పునరుద్ధరిస్తారా? ఎప్పుడు చేస్తారు? రైతు మరణానికి గురైతే బీమా వర్తిస్తుందా? అన్న ప్రశ్నలు రైతు కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధిదారులు అందిన సాయం
(రూ.కోట్లలో..)
2018–19 83,924 484 24.20
2019–20 85,466 521 26.05
2020–21 86,079 737 36.85
2021–22 97,264 648 32.40
2022–23 1,05,831 705 35.25
2023–24 1,13,191 825 41.25
2024–25 1,18,227 808 40.40
2025–26 1,17,023 679 33.95
(22.08.2026 నాటికి)
ప్రభుత్వ నిబంధనల మేరకే..
అన్నదాతల కుటుంబాలకు రైతుబీమా అత్యంత భరోసానిస్తోంది. జిల్లాలో ఏటా అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బీమా పునరుద్ధరణ, కొత్త దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వస్థాయిలో విధివిధానాలు రాగానే క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగవంతంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి
ఏడాది వారీగా అందిన సాయం..
బీమాతో మేలు..
రైతు సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రైతుబీమా పునరుద్ధరణ విషయమై రైతుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలి. ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. బీమా పథకం కొనసాగించాలని కోరుతున్నా.
– వంగూరు రామకృష్ణారెడ్డి, అజ్జకొల్లు
రైతు కుటుంబాలకు భరోసా..
గత ప్రభుత్వం ప్రారంభించిన రైతుబీమా పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలి. అనుకోని సంఘటనలతో కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి ఈ బీమా ఆర్థిక భరోసానిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేయాలి.
– సత్యనారాయణచారి నర్సింగాపురం
ముగిసిన రైతుబీమా గడువు.. పునరుద్ధరణపై స్పష్టత కరువు
జిల్లాలో 1.85 లక్షల మంది రైతులు
ఏటా పెరుగుతున్న అర్హుల సంఖ్య
ఈ నెల 13తో ముగిసిన గడువు


