వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ విభాగంలో చాలా రోజులుగా తీసుకెళ్లని పార్సళ్లకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్, ఆటోమొబైల్స్ స్పేర్స్, క్లాథ్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు ఉన్నాయని.. ఆసక్తి గల వ్యాపారులు, పట్టణవాసులు వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 91542 98609 సంప్రదించాలని సూచించారు.
‘సర్’ ప్రక్రియకు
సహకరించాలి
వీపనగండ్ల: గ్రామాల్లోని ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు సకాలంలో అందజేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ కోరారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించారు. అర్హులైన ఓటర్లు బాధ్యతగా వ్యవహరించి తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు బీఎల్వోలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిరక్షరాస్యులు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించేందుకు గ్రామాల్లోని బీఎల్ఏల సహకారం తీసుకోవాలని, వలస ఓటర్లు తమ ఓటు హక్కును నిలుపుకోవాలని ఆయన కోరారు.
స్వీపర్లపై వేధింపులు ఆపాలి : ఏఐటీయూసీ
వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం స్వీపర్లు, స్కావెంజర్లపై వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోషా డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన స్వీపర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వీపర్లకు తక్కువ వేతనం చెల్లిస్తూ ఎక్కువ పని చేయిస్తున్నారని.. ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 ఇస్తుంటే వీరికి మాత్రం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. అరకొర వేతనానికి రోజంతా పాఠశాలల్లోనే ఉంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉదయాన్నే పాఠశాల ఊడ్చడం, తాగునీరు అందించడం మాత్రమే స్వీపర్ల పనని.. గతంలో ప్రభుత్వం మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా స్కావెంజర్లను నియమించి తర్వాత తొలగించిందని తెలిపారు. ముఖ్యంగా కొత్తకోట మండలంలో వేధింపులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 30న పెబ్బేరులో జరగబోయే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నేతలు గోపాల్గౌడ్, మాలిక్, శోభారాణి, చంద్రమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
టూడేలీగ్లో
విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో సోమవారం నుంచి జరిగే హెచ్సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్సీఏ టూడేలీగ్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూడేలీగ్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శన చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా, ఏకాగ్రతతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రానున్న రోజుల్లో రంజీ, భారతజట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా జట్టు తన తొలి మ్యాచ్లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది.
ఉమ్మడి జిల్లా జట్టు ఇదే..
ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్నగర్), సంజయ్ (నాగర్కర్నూల్), అభిలాష్గౌడ్ (నారాయణపేట), వర్షిత్రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్కర్నూల్), శశాంక్ (మహబూబ్నగర్), జి.జశ్వంత్ (నాగర్కర్నూల్), ముఖిత్ (మహబూబ్నగర్), గగన్ (నాగర్కర్నూల్), వెంకట్సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు.


