మహబూబ్నగర్ క్రైం/ అమరచింత: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి జైలు నుంచి పరారై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్వగ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింత మండలంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించి.. గత నెల 2న పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అమరచింత పోలీస్స్టేషన్లో జూన్ 7న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జూన్ 10న పోలీసులు ఇద్దరిని ఆత్మకూర్ స్టేషన్కు తీసుకువచ్చారు. అమ్మాయి మైనర్ (మేజర్ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది) కావడంతో కిశోర్కుమార్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సదరు బాలికను వనపర్తి సఖి సెంటర్లో ఉంచారు. దాదాపు 25 రోజులపాటు జైలు జీవితం గడిపిన కిశోర్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తోటీ ఖైదీలతో చెస్ ఆడి..
జైలు నుంచి పరారైన కిశోర్కుమార్రెడ్డి అర్ధరాత్రి వరకు జైలులో తోటీ ఖైదీలతో చెస్ ఆడినట్లు తెలుస్తోంది. జైలు నుంచి తప్పించుకోవాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడా..? లేక అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకున్నాడా.. అనేది స్పష్టత లేదు. జనరల్ బ్యారక్లో అందరి మధ్య ఉన్న అతను ఒంటరిగా వెనక భాగం వైపు వెళ్లినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. జైలులో సాధారణంగా అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడంటే జైలులో భద్రతా లోపంపై విమర్శలు వస్తున్నాయి.
సుదీర్ఘంగా విచారణ
జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైలుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఖైదీ పరారైన ఘటనపై సుదీర్ఘంగా విచారణ సాగించారు.
మహబూబ్నగర్ జిల్లా జైలు
జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకొని రావడంతో కలకలం
తాను ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవ.. ఆత్మహత్యాయత్నం
జిల్లా జైలులో బయటపడిన భద్రత డొల్లతనం.. జైళ్ల శాఖ డీఐజీ విచారణ
స్వగ్రామంలో కలకలం..
జైలు నుంచి తప్పించుకున్న కిశోర్కుమార్రెడ్డి నేరుగా స్వగ్రామానికి వచ్చాడన్న సమాచారంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిశోర్ తమ ప్రేమ పెళ్లిని కాదని విడదీసిన పంచాయతీ పెద్దలను దూషిస్తూ.. తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ నానో యూరియా తాగడంతో సర్వత్రా కలకలం రేగింది. తాను పేదవాడినని, ఖాళీగా తిరుగుతున్నాననే సాకుతో తమను విడదీశారని, అమ్మాయిని కలవకుండా మైనర్ అని సఖి కేంద్రంకు పంపారనే కారణాలతో కిశోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.


