వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని గురువారం తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆమెకు పూలమొక్క అందజేయగా.. అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయకస్వామిని కమిషనర్ కుటుంబం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రాలు అందించి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని తంజాపూర్ చిత్రాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


