వనపర్తి: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలని.. సర్వే పూర్తయిన వాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన నీటిపారుదలశాఖ, సర్వేశాఖ, ఎస్డీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, బుద్ధారం లెఫ్ట్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డీ–1, డీ–5, డీ–8 కాల్వల నిర్మాణాలకు ఇప్పటికే పెగ్ మార్కింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. సర్వే పూర్తయిన 269 ఎకరాల భూములకు వెంటనే సబ్ డివిజన్ రిపోర్ట్ పూర్తిచేసి.. రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అదే విధంగా ఎస్డీఆర్ పూర్తయిన వెంటనే ఆయా భూములకు ఈ నెల 10వ తేదీలోగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఇంకా పెగ్ మార్కింగ్ పూర్తికాని భూముల సేకరణపై సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం భూసేకరణ పూర్తిచేస్తేనే ప్రాజెక్టుల పురోగతి మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్కుమార్, నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, సర్వేశాఖ ఏడీ శ్రీనివాసులు ఉన్నారు.


