కొత్తకోట రూరల్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమడబాకుల రైతువేదిక నుంచి రైతునేస్తం కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు, రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రైతుభరోసా ద్వారా సకాలంలో పెట్టుబడి సాయం అందించి ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తోందని తెలిపారు. రైతుభరోసా, ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యం, సన్నరకం వరికి బోనస్ వంటి కార్యక్రమాలతో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, బోయేజ్, రావుల కరుణాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, రంగారెడ్డి, సర్పంచ్ గాయత్రి, కొల్లంపల్లి అబ్దుల్లా, కావలి తిరుపతయ్య, ఉప సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


