వనపర్తి: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు పంపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిష్కార మార్గం చూపకుండా అర్జీని తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దన్నారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 63 అర్జీలు దాఖలైనట్లు సిబ్బంది తెలిపారు.
ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభి


