వనపర్తి: బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభికి బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయగా ఆయన స్వయంగా స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు ఫారాన్ని పూర్తిగా, స్పష్టంగా నింపే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఓటరు అవసరమైన వివరాలు సక్రమంగా నమోదు చేసి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోగా సమర్పించేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఓటరుకు ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని.. ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


