వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మత్తుకు బానిసైతే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు భవిష్యత్ దెబ్బతింటుందని తెలిపారు. డ్రగ్స్ విక్రయించడం, కొనుగోలు చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ నాటిక ప్రదర్శించారు. నాటికలో మాదక ద్రవ్యాలతో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దివ్యతేజ, మహాలక్ష్మి, ఏఓ బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


